కొత్త టీచర్లకు వేళాయే...

కొత్త టీచర్లకు వేళాయే...
  • సర్కారు బడుల్లో పాఠాలు చెప్పనున్న టీచర్లు
  • హైదరాబాద్ జిల్లాలో 584 మంది ఎంపిక
  • నేడు కౌన్సిలింగ్​ తర్వాత ఆర్డర్స్..​
  • ఇందులో 386 మంది ఎస్జీటీలే..

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఇటీవల అపాయింట్ మెంట్ లెటర్స్​అందుకున్న డీఎస్సీ అభ్యర్థులు బుధవారం నుంచి ప్రభుత్వ స్కూళ్లలో టీచర్​కొలువులకు వెళ్లనున్నారు. నియామకపత్రాలు అందుకున్న అభ్యర్థులకు మంగళవారం కౌన్సిలింగ్​ముగిసిన తర్వాత పోస్టింగ్ ఆర్డర్స్​ఇవ్వనున్నారు. హైదరాబాద్ జిల్లాలో 584 మంది టీచర్లు పోస్టింగ్స్​తీసుకోనుండగా, ఇందులో 386 మంది ఎస్జీటీలు, 107 మంది స్కూల్​అసిస్టెంట్లు, 91 మంది లాగ్వేజ్​పండిట్లు ఉన్నారు. జిల్లాలో 691 స్కూళ్లుండగా లక్షకు పైగానే విద్యార్థులు చదువుతున్నారు. వీరికి సుమారు 4 వేల మంది టీచర్లు మాత్రమే ఉండడంతో చాలా స్కూళ్లలో అరకొరగా చదువులు సాగుతున్నాయి. ఏండ్ల నుంచి టీచర్​ పోస్టుల భర్తీ చేయకపోవడంతో పిల్లలు అనుకున్న ఫలితాలు సాధించలేకపోతున్నారు. ప్రస్తుతం పోస్టుల భర్తీతో చాలా వరకు ప్రైమరీ స్కూళ్లలో టీచర్ల లేమి బాధ తప్పనుంది.  

878 పోస్టులకు 584  భర్తీ..

హైదరాబాద్​జిల్లాలో 878 పోస్టులు ఖాళీ ఉండగా 584 పోస్టులు భర్తీ చేశారు. రిజర్వేషన్లు, కోర్టు కేసులు, సర్టిఫికెట్​వెరిఫికేషన్ లో లోపాల వల్ల మరో 294 మంది పోస్టింగులు పెండింగ్​లో పడ్డాయి. ఉర్దూ మీడియంలో 185 పోస్టులుండగా, రిజర్వేషన్‌‌ కేటగిరీలో అభ్యర్థులు లేక 82 మందికి మాత్రమే నియామకపత్రాలిచ్చారు. మిగిలిన103 ఉర్ధూ మీడియం పోస్టులను భర్తీ అయినట్లే చూపించారు. పీఈటీ, ఎస్జీటీ, ఎస్ఏ స్పెషల్​ఎడ్యుకేషన్​ పోస్టులు..స్థానికత, తదితర సమస్యలతో కోర్టులో కేసు ఉండడంతో 159 పోస్టులకు సంబంధించిన ఫలితాలను రిలీజ్ చేయలేదు. సర్టిఫికెట్​వెరిఫికేషన్​లో తప్పుల వల్ల మరో 32 మంది పోస్టింగ్స్​పెండింగ్‌‌లో పడిపోయినట్లు తెలుస్తోంది. వీరందరినీ మినహాయించగా 584 మంది నేడు పోస్టింగ్ ఆర్డర్స్​అందుకోనున్నారు. 

 స్టాన్లీ స్కూల్​లో కౌన్సిలింగ్

హైదరాబాద్ సిటీ/ఇబ్రహీంపట్నం/వికారాబాద్​, వెలుగు:  అపాయింట్​మెంట్ లెటర్స్ అందుకున్న అభ్యర్థులకు మంగళవారం కౌన్సిలింగ్​ నిర్వహించనున్నట్లు హైదరాబాద్​ డీఈవో ఆర్.రోహిణి తెలిపారు. అబిడ్స్ ​చాపెల్​రోడ్​లో ఉన్న  ఎస్ఎస్సీ బోర్డుకు ఎదురుగా ఉన్న స్టాన్లీ గర్ల్స్​ హైస్కూల్​లో ఉదయం 9 గంటల నుంచి కౌన్సిలింగ్​ఉంటుందన్నారు. అభ్యర్థులు తమతో పాటు అపాయింట్ మెంట్​ఆర్డర్​, రెండు పాస్ పోర్ట్​ సైజ్​ఫొటోలు, హాల్​టికెట్లు తీసుకురావాలని కోరారు. కౌన్సిలింగ్​హాల్​లోకి అభ్యర్థులను మాత్రమే అనుమతిస్తామని చెప్పారు.  రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కొంగరకలాన్​లోని డీఈవో ఆఫీస్​లో , వికారాబాద్​ జిల్లా అభ్యర్థులకు డీఈవో ఆఫీస్​లో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు.